Pages

29, జనవరి 2011, శనివారం

" నవ్వి పోనిమ్ము లేదులే నాకు సిగ్గు ! "

వలపు విరహాల సంకెల బిగుసు కొనగ
ముద్దు మురిపాలు పంచగ మంగ చెంత .
కొండ దిగి దిగి నడిరేయి గడచి యైన
నవ్వి పోనిమ్ము లేదులే నాకు సిగ్గు.!
----------------------------------
పెద్ద వయసున నేర్చిన విద్య లెపుడు
వమ్ము కాబోదు చదివిన వింత హాయి
వయసు బేధము లెదన విద్య కెపుడు
నవ్వి పోనిమ్ము లేదులే నాకు సిగ్గు

27, జనవరి 2011, గురువారం

" భామకు చీరేల నయ్య పదుగురు చూడన్ ? "

చేమంతి పూసే ముంగిట
హేమంతపు ఋతువు గాన హిమమే కురియన్ !
ధామమున కులికెడి చిలుక
భామకు చీరేల నయ్య పదుగురు చూడన్ ? "

24, జనవరి 2011, సోమవారం

" పద్మ సౌరభం "

ఇంటింటా ప్రతి ఇంటా చిన్న బడ్డీ కొట్టు దగ్గర్నుంచి పెద్ద పెద్ద బంగారు షాపుల్లోను, మనకి లక్ష్మీ దేవి పద్మ పీఠం మీద నెలకొని పద్మ హస్తయై కనిపిస్తూ ఉంటుంది. ఇక లలితా త్రిపుర సుందరి మహా పద్మాటవి లోనే విహరిస్తుంది. ఐతే ఈ పద్మానికి ఆద్యాత్మిక భౌతిక ప్రాముఖ్యం ఎంతగానో ఉంది. నిజానికి అసలు ముందు పద్మం పుట్టి సృష్టి తర్వాత జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పురాణయుగంలో శేషతల్పంపైన శయనించిన మహా విష్ణువు నాభి కమలం నుంచి ఒక పద్మం అవతరించిందనీ, ఆ పద్మంలో నుండి సృష్టికర్త బ్రహ్మ దేముడు ఆవిర్భ వించాడనీ, అందుకే ఆ సమయంలో ఆ కాలాన్ని పురాణాల్లో "పద్మ కల్పం" అన్నారనీ ఆ పద్మం పేరునే "పద్మ పురాణం" అనీ లోకవిదితం. అందుకే పద్మం నుంచి పుట్టిన వాడు గనుక బ్రహ్మ "పద్మ సంభవుడుగా పేరు గాంచాడు". ఐతే ఈ పద్మం ఎందరో దేవతలకి ఆసనంగా అందంగా అలరారు తుంది.ముఖ్యంగా స్త్రీల అందచందాలని కవులు "పద్మాక్షి... పద్మ నయన... పద్మానన... పాద పద్మాలు" ఇలా వర్ణిస్తూ ఉంటారు. అంతే కాదు, "పద్మినీ జాతి స్త్రీలు" అని ఒక తెగ [నాలుగు జాతుల్లో].

వికసించిన పద్మం జ్ఞనానికి చైతన్య వికాసానికి ప్రతీక ఇక కవుల హృదయాలకి శిరీష కుసుమమే. చైతన్య కేంద్రాలను "చక్రాలు" అంటారు.

ఉదాహరణకు మొదటిదైన మూలాధారం భౌతిక చైతన్యానికి కేంద్రం. ఇది ఎరుపు రంగుతో నాలుగు రేకుల పద్మంలా ఉంటుంది. ఉదరం వద్ద చైతన్య కేంద్రం గాఢమైన ఎరుపు, నీలం రంగు కలిసి ఆరు రేకుల పద్మంలా ఉంటుంది. ఆ పైన నాభి వద్ద ఊదా రంగులో[చైతన్య కేంద్రం ] పది రేకుల పద్మం లా ఉంటుంది. ఇక కంఠం వద్ద బూడిద రంగులో పదహారు రేకుల పద్మంలా ఉంటే కనుబొమల మధ్య చైతన్య కేంద్రం తెలుపు రంగులో రెండు రేకుల పద్మం లా ఉంటుంది. చివరిగా తల భాగంలో బంగారు కాంతుల మధ్య నీలి రంగులో వేయి రేకుల పద్మంలా ఉంటుంది. అమ్మవారి నెలవు అదే. కేవలం కావ్యాలలోనే గాక ఆధ్యాత్మిక పరంగా పద్మానికి గల ప్రాముఖ్యత ఎంత గొప్పదో దీన్ని బట్టి విదితమౌతుంది.

ఐతే ఈ పద్మం కేవలం మన దేశానికే కాదు, మన దేశంలోనే దేవతలకు పూజా పుష్పంగా ఆసనంగ కవులకు వర్ణనీయంగా భావించటమే కాదు, ఇతర దేశాల్లో కూడా పద్మ ప్రియులు చాలా చాలా ఉన్నారు. "జపాన్, చైనా, టిబెట్, ఈజిప్టు" వంటి అనేక చోట్ల ఈ పద్మాలు పెరుగుతాయి. అనాదిగా ఈ పూలు పెరగడమే గాక అతి పవిత్రమైన పుష్పంగా ఆరాధించడం, బౌద్ధ మతంలో కూడా దీన్ని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పూజించడం ఆచారంగా ఉంది. ఈ పద్మాలు చెరువుల్లోను, సరస్సులోను ఎక్కువగా వికసిస్తాయి. ఇంచు మించు ఒకే ఆకారం గల ఈ నీటిపూలను సంస్కృతంలో "పద్మం, కమలం, పంకజం" అని అనేక రకాలుగా పిలుస్తారు.

ఈ పద్మ పత్రాలు గుండ్రంగా ఎనభై సెంటీమీటర్ల చుట్టు కొలతతో నీటి మీద తేలుతున్నట్లుగా వ్యాపించి చెరువంతా గొడుగుల్లా అందంగా కనిపిస్తాయి. ఈ పద్మపత్రాల వేళ్ళు తెలుపు లేదా ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి ఒకోసారి మీటరు ఎత్తుగా లేదా పదిహేను సెంటీ మీటర్ల వరకు అడ్డంగా విస్తరిస్తాయి. వీటి చుట్టుకొలత ఇంచు మించు తొమ్మిది సెంటీ మీటర్ల వరకు ఉంటుంది.

ఇవి అందానికే కాదు, తినడానికి కూడా ఉపయోగించు కుంటారు. తాజా వేళ్ళను వేయించుకుని ఎండ బెట్టిన వేళ్ళను చిన్న చిన్న ముక్కలుగా తరిగి కూరల్లోకి కలుపుకుని తింటారు. చైనా, జపాన్ లాంటి ఇతర దేశాల్లో ఈ వేళ్ళతో ఊరగాయలు పెట్టి శీతాకాలంలో తినడం కద్దు.

ఈ వేళ్ళ నుంచి తయారు చేసే పాలపొడిలో ఎన్నో పోషక విలువలుంటాయి. ఇది చిన్న పిల్లల్లో అతిసారం వంటి వ్యాధులను నివారిస్తుంది. ఈ వేళ్ళతో తయారు చేసిన పేస్టు చర్మ రోగాల నివారిణి. అంతే కాదు పూల మధ్య లో ఉన్న కర్ణికను ఎండబెట్టి చైనా వారు వాసన కోసం "టీ" లో ఉపయోగిస్తారు. ఇంకా చెప్పాలంటే పద్మాల నుంచి సేకరించిన తేనెలో బలవర్ధక లక్షణాలుంటాయి. కంటి సమస్యలకు ఈ తేనె బాగా ఉపయోగ పడుతుంది. ఇక విత్తనంలో ఆకుపచ్చ రంగులో ఉండే బీజాకారం చాలా విష పూరితంగా చేదుగా ఉంటుంది. కానీ దాని చుట్టూ ఉన్న తొనల్లో అపారమైన పోషక విలువలుంటాయి, "సి" విటమిన్ ఉంటుంది. ఈజిప్టులో ఈ విత్తనాలను పిండి చేసి పాలతోగాని నీటితోగాని ఆ పిండి తడిపి రొట్టెలు చేసుకుని తింటారట. అంతే కాదు, ఈ విత్తనాలను పచ్చిగా గాని వేయించి గాని ఉడకబెట్టిగాని తినవచ్చు. సృష్టికి ముందే అవతరించిన ఈ పద్మం కనువిందు చేసే కాంతివంతమైన రూపంతో పాటు దైవికంగా సాహితీ పరంగా ఆధ్యాత్మికంగా భౌతిక చైతన్య కేంద్రంగా ఎన్నో అంద చందాలను సుమ సౌరభాలను విరజిమ్ముతూ ఇన్ని సుగుణాలను కలిగి ఉంది. మనకు ప్రకృతి పరంగా లభించిన వర ప్రసాదం ఈ అందమైన పద్మం.

23, జనవరి 2011, ఆదివారం

" సీతా దేవి శాపం "

పితృ వాక్య పరిపాలకుడైన శ్రీ రామచంద్రుడు భార్యాసమేతుడై, తమ్ముడు లక్ష్మణునితో సహా అడవుల కేగిన సంగతి జగద్విదితమే. ఐతే, అలా కానన భూములలో సంచరించు సమయమున, పల్గుణీ నదీ తీరమున ఒక పర్ణశాలలో ఉన్నారు.

అప్పుడు రామ లక్షమణులు పితృ శ్రాద్ధము నిర్వహింపవలసిన తిథి వచ్చినది. అందుకు కావలసిన వస్తువులను తీసుకుని రమ్మని, చేరువనే ఉన్న ముని పల్లెకు శ్రీరాముడు లక్ష్మణుని పంపెను. లక్ష్మణుడు ఎంతకీ రానందున స్వయముగా తానే బయలుదేరెను. మధ్యాహ్న సమయము మించి పోవు చుండెను.

సీత ఒంటరిగా పర్ణశాలలో వారి రాకకై ఎదురుచూచుచూ " అపరాహ్ణము మించిన పిదప ఆబ్ధీకము పెట్టుట శాస్త్రవిరుద్ధము కదా ! " అని తలచి, తుదకు తానే ఫల్గునీ నదిలో స్నాన మాచరించి, తడిబట్టలు కట్టుకుని లభించిన వాటితో పిండప్రదానము చేసి, పితృదేవతలను తృప్తి నొందించెను.

అందులకు సంతసించిన దేవతలు "జనక నందినీ ! మేమిప్పుడు సంతృప్తి నొందినాము. నీవు మిక్కిలి ధన్యురాలవు" అన్న మాటలు ఆమెకు వినబడినవి. అంతేగాక, పితృదేవతలు ప్రీతితో ఆమె వంటకములను, శాకపాకములను పరిగ్రహించుటకై చేతులు జాచి యున్నట్లు కన్నులారా గాంచి ఆశ్చర్య చకితురాలైనది.

అప్పుడు ఆమె తన సంశయ నివృత్తికై "మహనీయులారా ! ఎవరు మీరు? ఈ వింత ఏమి?" అని సవినయముగ ప్రశ్నించినది. అందులకు దశరథుడు "అమ్మా సీతా ! నేను నీ మామను, దశరథుడను, వీరు నా పితృ పితామహులు. నీ వొనరించిన పిండ ప్రదానము స్వీకరించి మేము సంతుష్టుల మైతిమి. ఇది గయాశ్రాద్ధ ఫలితమునకెన యైనది" అని అదృశ్య రూపమున ముదమున బల్కెను.

అందులకు సీత వెరగుపడి " ఓ మహాత్మా ! నేను ధన్యు రాలను. కానీ, ఇట్టి సంఘటన మున్నెన్నడును ఎవరు విన్నదీ కన్నదీ కాదు. నేనిట్లొనరించిన పిండ ప్రదానమును చేజేతుల మీరు పరిగ్రహించితిరి. కావున మరి శ్రీ రామచంద్రు డెట్లు నమ్మగలడు? అందులకు సాక్ష్యమేమి గలదు? తామే సెలవీయ గలరు. " అని వినయముగా వేడుకొనెను.

అందులకు దశరథుడు " కోడలా ! ఈ విషయము సత్యేతరము గాదని రూఢిగా పల్కుటకు కొందరి నెవరినైనా ఏర్పాటు జేయుము " అనెను.

అప్పుడు సీతాదేవి " ఫల్గుణీ నదినీ, సమీపములో మేత మేయుచున్న గోవును, అగ్ని దేవునీ, మొగలి పువ్వును, సాక్ష మిచ్చుటకు ఆధారముగా చేసుకొంటి" నని పల్కెను. అంతట పితృదేవతలు అంతర్థాన మొందిరి.

ఇదంతయు జరిగిన పిమ్మట రామ లక్ష్మణులు శ్రాద్ధమునకు కావలసిన దినుసులు గైకొని వచ్చిరి. వెను వెంటనే శ్రీరాముడు సీతను గాంచి " దేవీ ! ఇప్పడికే కాలాతీత మైనది. కాలాతిక్రమణ దోషము ఆపాదించ కుండునట్లు నీవు త్వరిత గతిని స్నాన మాచరించి తద్దినపు వంట త్వరిత గతిని సిద్ధము చేయుము" అని ఆజ్ఞాపించెను. అందులకు సీతాదేవి చిరు నగవుతో జరిగిన దంతయు వినయముతో వివరించెను. అంతయు విన్న రామునకు నమ్మశక్యము గాక వింతగా దోచెను.
లక్ష్మణుని గాంచి " సోదరా ! ఇది ఏమి వింత ? మంత్ర తంత్రములతో ఆబ్ద్దీకమును విధి విధానముగా నొనరించుట కొడుకులకు విధ్యుక్త ధర్మముగదా ! పుత్రులు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధ కర్మలు నిర్వహించి పితృదేవతలను సంతుష్టులను జేయుట లోక సహజము కదా ! మరి కోడలు తద్దినము పెట్టుట, పెద్దలు చేజేతుల అందుకొని భుజించుట వింతగా నున్నదే ! లోకాతీతము గదా?" అని తన సందేహమును వ్యక్తపరచెను. అంతే కాదు కాలాతీతమైనందున ఆమె శ్రమ కోర్వజాలక అట్లు పలుకుచున్నదేమో అన్న అనుమానముతో సూటిగా మరల ప్రశ్నించెను. అందులకు సీత పల్గుణీ నదిని, గోవును, అగ్నినీ, కేతకీ [మొగలి పువ్వు ] పుష్పమును సాక్ష్యము చెప్పుమని కోరినది. ఆశ్చర్యము సాక్షులు మారుబల్కక మిన్నకుండిరి.

అందులకు బాధపడి చేయునది లేక సీత స్నాన మాచరించి వంట కుపక్రమించి సర్వము సిద్ధము చేసెను. తదుపరి రామ లక్ష్మణులు శ్రాద్ధము పెట్టుటకు ఉపక్రమించి పితృదేవతలను ఆహ్వానించిరి. వారి పిలుపు నందుకున్న పితృదేవతలు " కుమారులారా ! ఇది ఏమి వింత ? ఇంతకు పూర్వమే సీతాదేవి మమ్ములను ఇష్ట మృష్టాన్నములతో సంతృప్తి నొందించినది. మరల మరల ఏల పిలుచుచున్నారు ?" అని ఒక అశరీరవాణి సూర్య మండలము నుండి పలికినది.

అందులకు శ్రీరామచంద్రుడు " తాత తండ్రు లారా! జానకి మాటలను నమ్మజాలక మిమ్ము శాస్త్రోక్త విధానముగా, మంత్ర పూర్వకముగా ఆహ్వానించితిమి మన్నింపుడు " అని బదులు బల్కెను . అందులకు
" ఇక శ్రాద్ధముతో పని లేదు. మేము తృప్తిగా భుజించితిమి, పితృశేషమును ఇక మీరు భుజింపుడు " అని దశరథుడు అశరీరవాణియై బదులు పల్కెను. అంతట అన్నదమ్ములు వెరగుపడి సీతను లోలోన అభినందించిరి. ఇది ఏమి వింత అని రామ లక్ష్మణులు తలపోయుచుండగా, సూర్య భగవానుడు వారికి సర్వము వివరించెను. పూర్తిగా విన్న పిదప సీతను వేనోళ్ళ కొనియాడి భుజించిరి, పిమ్మట సీత భుజించినది.

మరి సాక్షులందరు తటస్థముగా నుండుట కేమి హేతువు అని ప్రశ్నించగా వెనువెంటనే సీత వారిని పిలిచి, ఫల్గుణీ నదిని ఉన్నది ఉన్నట్టుగా తెలుపక దాచినందుకు "పాతాళ వాహినియై" పోవునట్లుగను, ఆవు ముఖ సందర్శనము అయోగ్య మగునట్లుగను, కేతకీ పుష్పము పూజకు అనర్హమగు నట్లుగను, అగ్ని దేవుని సర్వభక్షకుడుగను శపించెను.

కావున ఆవు ముఖము చూడరాదు. అందుకనే వెనుకభాగము తోక వైపు చూడాలని, ఆచరణ యోగ్యమైనది ఫల్గునీ నది ఉన్నది ఉన్నట్లు తెలుపక దాచి నందుకు " పాతాళ వాహినియై " పోవునట్లు, ఇక అగ్ని, మొగలి తెలిసినవే.

15, జనవరి 2011, శనివారం

" ఉంగరం "

"అబ్బో! నా ఉంగరం దొరికింది!" అంటూ మూడు పదుల సుధ మూడేళ్ళ పిల్లలా గెంతింది.

"అబ్బా! దొరికిందా! పోన్లే ఇన్ని రోజులుగా వెతుకుతున్నాం, అసలే ప్రధానపుంగరం. హమ్మయ్య! దొరికింది కదా?" అన్నాడు భర్త శ్రీను స్కూటరు పార్క్ చేసి లోపలి కొస్తూ.

"అదేనండీ! ఈ రోజు గురువారం కదా! గుడి నుంచి వచ్చేసరికి ఖచ్చితంగా దొరుకుతుందనుకున్నాను. అంతా బాబా మహత్యం" అంటూ సుధ ఉంగరంతో సహా హాల్లో కొచ్చి అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న అత్తగారికి, మామ గారికి, బావగారికి చూపించింది.

"పోనీలే మన బంగారం మంచిది, దొరికింది అంతే చాలు" అంటూ అత్తగారు ఆదిలక్ష్మి ఓ సారి ఉంగరాన్ని చేతిలోకి తీసుకుని పరికించి చూసి పక్కనే ఉన్న భర్తకి, కొడుక్కి చూపించింది సాలోచనగా వారివైపు చూస్తూ. ముగ్గురి కళ్ళల్లోను వింత మెరుపు.

ఇంత మాట్లాడుకుంటున్నా అప్పుడే సందె గుమ్మాలు ఊడ్చి వంట గదిలో జొరబడిన పెద్ద కోడలు రాణి గారు ఉలుకు పలుకు లేదు సరికదా అసలు వంట గదిదాటి బయటకు రాలేదు. అన్ని నిశితంగా గమనిస్తున్న ఆదిలక్ష్మి, సుమారు ఇరవై రోజులుగా పోయిందన్న ఉంగరం ఇల్లంతా అణువణువూ దులిపి గాలించినా దొరకని ఉంగరం అందరి బీరువాలు గాలించినా దొరకని ఉంగరం ఈ రోజు ఇంత హఠాత్తు గా అప్పుడే తుడిచిన గదిలో ఎలా దొరికిందో అర్ధం గాక ఆలోచనలో బడింది.

ఒక ఉన్నతోద్యోగిగా రెటైర్ ఐన శర్మ గారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు పెళ్ళై ఆరేళ్ళు గడిచినా ఇప్పుడే పిల్లలు వద్దని వాయిదా వేసుకున్నారేమే, ఈ మధ్య రెండేళ్ళ క్రిందట చిన్నవాడికి పెళ్ళి కావడంతో తమకింకా పిల్లలు లేకపోతే ఎదురయ్యే సమస్యలని గుర్తు చేసుకున్నట్టు తోడి కోడళ్ళిద్దరు అన్నిటితో పాటు వంతుగా పిల్లల్ని కూడా రెండు మూడు నెలలు అటూ ఇటూగా కన్నారు. అందుకే పెద్దవాడి కొడుక్కి పది నెలలు చిన్నవాడి కూతురికి ఎనిమిది నెలలు. అంచేత ఇద్దరికి చంటి పిల్లలే. ఇక అమ్మాయి నాలుగేళ్ళ క్రిందటే పెళ్ళిగావటంతో అత్తగారింట్లోనే ఉంది రెండేళ్ళ పసివాడు. బాధ్యతలు తీరి విశ్రాంతిగా ఉన్నారు ఆదిలక్ష్మి దంపతులు. ఐతే ఇంతకీ అసలు సంగతి, ఆ రోజు అదే పదిహేను ఇరవై రోజుల క్రిందట, ఏం జరిగిందంటే, ఆ రోజు శుక్రవారం కావటంతో ఉదయాన్నే తలంటు స్నానం చేసి ఆదిలక్ష్మి బయటికి వచ్చేసరికి తోడికోడళ్ళిద్దరూ వెతుకుతూ కనబడ్డారు.


"ఏమిటి? అంతగా వెతుకుతున్నారు?" అడిగింది అత్తగారు తలారబెట్టుకుంటూ.

"ఉంగరం అత్తయ్య గారు! పిల్లకి సిరిలాక్ తినిపిస్తూ తీసి పక్కన పెట్టాను. తీరా చేతులు కడుక్కుని వచ్చి చూద్దును కదా కనబడటం లేదు" అంది.

"అదేమిటి? ఇంతలో ఏమై పోతుంది? ఇంకా పనిమనిషి కూడా రాలేదుకదా ! ఉన్నది మీ ఇద్దరే కదా?" అంది ఆదిలక్ష్మి.

"అవును అదే అనుకుంటున్నాం. ఒకవేళ తుక్కులో ఏమైనా పడిందేమో?" అని నసిగారిద్దరు.

"తుడవందే తుక్కెక్కడిదీ? మొన్నటికి మొన్న నల్లపూసల దండతీసి దిండు మీద పడేసావ్. పిల్ల చేతిలోకి తీసుకుని ఆడుతోంది. గట్టిగా లాగితే? ఐనా పనిమనిషి వస్తుందేమో అన్న భయంతో తీసి నీ మంచానికున్న సొరుగులో పెట్టాను. వెంటనే చూసి తీసుకున్నావు గనుక సరిపోయింది. లేకపోతే పని వాళ్ళు తిరుగుతారు ఎవర్ననగలం ? ఐనా అంత అజాగ్రత్త ఐతే ఎలాగ? బంగారం అక్కడ ఇక్కడా పెట్టడం మంచి పద్ధతి కాదు. లక్ష్మిని లక్ష్య పెడితేనే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు!" అంటూ కాస్త గట్టిగనే మందలించింది అత్త గారు ఆదిలక్ష్మి.

ఆ రోజంతా వెతికారు. మర్నాడు శనివారం కావడంతో ఇద్దరు పుట్టిళ్ళకి వెళ్ళి పోయారు. కొంచెం ఆశ్చర్య పడింది ఆదిలక్ష్మి. ఎందుకంటే, చిన్నావిడ సాధారణంగా ప్రతి రోజూనో, రెండు రోజులకో పుట్టింటికి వెళ్ళి పోతూనే ఉంటుంది. ఎవరి అనుమతీ అవసరం లేదు ఎవరికి చెప్పవలసిన పనిలేదు. గుమ్మంలోకి వచ్చిన ఆటోని ఆపుజేసుకునో పనిమనిషితో తెప్పించుకునో ఇంకా వీలుకుదిరితే ఉదయం భర్తతోనే వెళ్ళి సాయంత్రానికో మర్నాటికో ఎప్పటికో తనిష్టం వచ్చినప్పుడు భర్తతో కలిసి వస్తూ ఉంటుంది, అది అలవాటే. కానీ పెద్దావిడ రాణి గారు మాత్రం భర్తతో స్కూటరు మీదో, కార్లోనో నెలకో రెండునెల్లకో ఓ సారి వెళ్ళి మళ్ళీ భర్త గారితోనే వచ్చేస్తుంది. అటువంటిది క్రిందటి వారమే వెళ్ళినా మళ్ళీ అంత హడావుడిగా ఎందుకు వెళ్ళిందా? అన్న ఆలోచన ఆదిలక్ష్మిని అంటి పెట్టుకుని ఉంది.

సరే ఈనాటి కోడళ్ళ గుప్పెళ్ళు నిండుగా లా పాయింట్లు. ఓ సక్కుబాయి అత్తగార్ని ఉదహరించుకుని అందర్నీ అదే కోవలో నిరూపిస్తూ అవకాశం దొరికింది కదా అని తమ సుఖాల కోసం తమ అవసరాల కోసం తమ స్వార్థం కోసం భర్తలకి నూరిపోసి తమ గుప్పెట్లో ఉంచుకున్న కోడళ్ళు స్వేచ్ఛగా రాజ్య మేలుతున్న రోజులివి. వారు ఏం చెప్పినా ఎదుటివారు నమ్మలేనంతగా బిల్డప్ప్లు ఇచ్చి అత్తల్నే అగచాట్ల పాలు చేస్తున్న కోడళ్ళ యుగమిది. అందుకే ఎంత ఆదర్శానికి పోయినా అత్తల గోడు అరణ్య రోదనే.

ఒక మనిషిని అంచనా వేయాలంటే పుట్టుకతో వచ్చిన సంస్కారమేదైనా ఉంటే తెలియాలిగానీ నేర్చుకుంటే వచ్చిన చదువు వల్ల కాదు. చరిత్ర తిరగ బడుతున్న రోజులివి. ఇలాంటి ఆడవారి మధ్య జరిగే విషయాలు పొద్దున్న పోయి సాయంత్రం ఇల్లు జేరే కొడుకులతో చెప్పుకుని వారి మనసుని గాయపరచి మనశ్శాంతి లేకుండా చేయడం ఏ తల్లికి నచ్చని పని అందుకే ఏం చేస్తాం ?

ఇలాంటి చిల్లర విషయాలన్ని మనసులోనే ఉంచుకుని భర్తతో మాత్రం ఒక మాట అంది ఆదిలక్ష్మి. ఇవన్నీ తనకి సాక్షం లేని పన్లు అనుకుంటూ, "చూడండీ! నేనిలా తలస్నానం చేసి వచ్చేసరికి ఉంగరం పోయిందన్నారు మొన్నటికి మొన్న గొలుసు సంగతి చెప్పాను కదా ! ఐనా అంత నిర్లక్ష్యం ఐతే ఎలాగ చెప్పండి ? అక్కడికీ అబ్బాయిలకి చెబితే ' మనకెందుకులే అమ్మా ఏదో ఏడవనీ ' అని తేలిగ్గా తీసి పారేసారు. ఇంక గట్టిగా నేనేమైనా అంటే అత్తగారు రాక్షసి పీక పిసికేస్తంది, కిరసనాయిలు పోసి అంటించగల్దు అని ఒక ప్రచారం. లోకం వాళ్ళ మాటే నమ్ముతుంది కానీ నిజానిజాల్ని పరిశీలించదు కదా ?" అని బాధ పడింది.

అంతా విన్న భర్త "మనకెందుకు మన డ్యూటీ ఐపోయింది. వాళ్ళ బుద్ధి వాళ్ళకే అమ్మలు ఏదైనా మంచి నేర్పి ఉంటే కాస్త మారతారు లేదా మన ఖర్మ. ఇంకా నయం విడాకులిచ్చే కోడళ్ళు లేచి పోయే కోడళ్ళు విషం కలిపే కోడళ్ళు వస్తున్న ఈ రోజుల్లో మనం సంతోషించాలి" అని భార్యని ఊరడించాడు.

వడ్డించిన విస్తరిలా అన్నీ అమర్చిన ఇంట్లో అడుగు పెట్టిన కోడళ్ళకి ఎందుకిలాంటి చిల్లర బుద్ధులో అర్థం కాని ఆదిలక్ష్మి ఈ ఉంగరం ఎలా తేల్తుందో అని వేచి చూస్తోంది. పని మనిషి కూడా రాకముందు, మరింకెవరు లేని సమయంలో ఆ ఇద్దరిమధ్య ఉంగరం పోవడమే వింతగా ఉంది. ఒక వేళ ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు దాచేసి అబద్ధం చెప్పినా అది భర్తనుంచి దాచిన డబ్బు కొంత అడిగి తీసుకున్నది కొంత కలిపి ఆకారం మార్చి అమ్మ చేయించిందని చెప్పి ఏదో ఒక రోజు గొప్పగా తనకి చూపించి వాడుకోవడం మొదలు పెడతారు. ఎందుకంటే ఇద్దరికిద్దరూ ఇలాంటి వాటిలో బాగా ఆరితేరిన వారు.

ఉమ్మడిలో ఉన్నప్పుడు జాగ్రత్తలు మెళుకువలు తెలిసిన దిట్టలు... పైగా క్రితం రోజునే పెద్దావిడ తల్లి వచ్చి వెళ్ళింది. బహుశా కూతుర్ని మందలించి "మనకెందుకే ఈ తలనొప్పి మళ్ళీ నెల్లో నీ చెల్లెలి పెళ్ళి కూడాను సెంటిమెంటల్ గా ఇది ప్రధానపు ఉంగరం అందుకని ఎక్కడో అక్కడ దొరికేలాగ పెట్టేసేయి అని చెప్పి కూతురుకిచ్చి వెళ్ళి ఉంటే త్వరలో దొరుకుతుంది. లేదా చిన్నావిడ దగ్గరే ఉండి ఉంటే అవకాశాన్ని బట్టి ఆకారం మారి ఎప్పుడో కనబడుతుంది" అని అనేకానేక ఆలోచన్లతో సతమతమౌతున్న ఆదిలక్ష్మికి ఈ రోజు జవాబు దొరికింది. కాకపోతే అసలు చిక్కు విడలేదు. ఇద్దరిలో ఎవరన్నది వారి మధ్యనే ఉండిపోయింది. పెద్దావిడ బీరువా కింద పెట్టిందా ? లేక చిన్నావిడ బీరువా కింద దొరికినట్టు గా చెప్పిందా? ఏది ఏమైతేనేం ఆకారం మారకుండా వచ్చిందంటే ఇద్దరి ప్లాను పారలేదన్న మాట ?

ఎవరి ఆలోచన్లు ఎలా ఉన్నా మొత్తానికి ఉంగరం దొరికిందన్న ఆనందం ఇల్లంతా నిండింది. ఐతే రాత్రి డైనింగు టేబుల్ దగ్గర మళ్ళీ ఒకసారి అందరికీ ఉంగరం గుర్తొచ్చింది.

"పోన్లే బాబు మన బంగారం మంచిది దొరికింది" అన్నాడు పెద్దవాడు.

"అవును ప్రధాన పుంగరం కదా సెంటిమెంటల్ గా బాధనిపించింది" అన్నాడు చిన్నవాడు.

"అంతా బాబా దయ అసలు పోయే అవకాశమే లేదు" అన్నాడు మామగారు శర్మ.

"ఏది ఏమైతేనేం దొరికింది అంతే చాలు" అంది ఆదిలక్ష్మి.

అంతా విన్న కోడళ్ళు "అత్తయ్య గారే తీసి దాచారనుకున్నాం" అన్నారు ముక్త కంఠంతో కూడా బలుక్కున్నట్టు.

అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెర్రి మొహాలు వేసారు. హఠాత్తుగా విన్న ఆదిలక్ష్మి విస్తుబోయి చేష్టలుడిగి శిలా ప్రతిమలా ఉండిపోయింది. "కోడళ్ళూ మీకు జోహార్లు మీరెంత కైనా తగిన వాళ్ళు. నిజంగా భగవంతుడనే వాడుంటే వాడే మిమ్మల్ని రక్షించాలి" బరువెక్కిన గుండెలతొ పాటు మెదడుకుడా మొద్దు బారింది.



































------------------------------------------------------------------------------


















-----------------------------------------------------------------------------



















------------------------------------------------------------------------------


















---------------------------------------------------------------------------

11, జనవరి 2011, మంగళవారం

సమస్య " కారము లేనట్టి కూర గాంతుడు మెచ్చెన్ ! "

బారుల తిరిగెడి భర్తకు
చారె యని కాచి యిచ్చె సతి క్రోధమునన్ !
బీరనుకుని త్రాగె నతడు
కారము లేనట్టి కూర గాంతుడు మెచ్చెన్ !

10, జనవరి 2011, సోమవారం

" మంచు పూలు "

"ఆంటీ ! ఈ రోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం. మీరంతా తప్పకుండా రావాలి" అంటూ పొద్దున్నే వచ్చిన నీలిమ పిలుపు. మొన్నటికి మొన్న "ఆంటీ! ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా! మీరొచ్చి తప్పకుండా వాయనం తీసుకోవాలి. పెద్దవారు కదా, ముందుగా మీకే ఇవ్వాలని. ఈ ఏడు మా అదృష్టం. ఇక్కడ ముత్తైదువలే దొరకరు. ఒక్కరు ఇద్దరు ఉన్నా, ఆఫీసులకి వెళ్ళి పోతారు. ఇక పెద్ద వాళ్ళంటే మీలా ఎవరైనా పేరంట్సు వచ్చినప్పుడే దొరుకుతారు. నేను మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.ఒక అరగంటలో వచ్చేయండి" అంటూ ఎదురింటి రమ ఆహ్వానం .

అంతేనా? అంతకు ముందు మొన్న మంగళవారం "ఈ రోజు శ్రావణ మంగళవారం కదా! పొద్దున్నే పూజ చేసుకుని ఆఫీసుకి వెళ్ళి పోయాను. ఇప్పుడే వచ్చాను. నాకు పదిమంది, నా ఫ్రండుకి పదిహేను మంది ముత్తైదువలు కావాలి. మీరంతా ఇంట్లో ఉంటామంటే శనగలు అవీ తీసుకుని తాంబూలం ఇవ్వడానికి వస్తాము" అంటూ ఒక స్నేహితురాలు ఫోను చేసింది. "తప్పకుండా రండి. మేమెక్కడికీ వెళ్ళము. మా చుట్టు పక్కల కూడా పది మంది దాకా దొరుకుతారు. మా ఇంట్లోనే మా అత్తయ్యగారు, మా అక్కా, నేనూ ముగ్గురు ఉన్నాం..." అంటూ చిన్న కోడలు ఫోను పెట్టేసింది.

ఇదంతా చూస్తుంటే శారదకి వింతగా అనిపించింది. ఏ...మి...టీ..? ఈ అమెరికాలో, ఇంత భారతీయత ఉట్టిపడుతోందా? ఇక్కడ కూడా ఫుజలూ, వ్రతాలు, నోములు మన సంప్రదాయాలను విడనాడకుండా? నిజమే తను వచ్చినప్పట్నుంచీ చూస్తోంది. చుట్టుప్రక్కల ఏ పదిమంది ఇండియన్సు ఉన్నా, అందరు కలిసి కట్టుగా ఆడా మగా పిల్లా జెల్లా కలసి మెలసి పూజలు, పార్టీలు, పిక్ నిక్కులు చేసుకుంటూనే ఉన్నారు. వెనుక బ్యాక్ యార్డ్ లాన్ లో ఆటలు, డెక్ మీద పాతియోలు శని ఆదివారాలు సాయంత్రాలు ఆనందంగా గడుపుతారు. ఇంట్లో ఎవరి భాష వాళ్ళు మాట్లాడుకుంటారు. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం ఇలా. ఐతే, ఇంతటి ఐకమత్యం మన దగ్గర లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఎదుటివాడి ఉన్నతిని చూసి ఏడవటం, వాణ్ణి ఎలా పడగొట్టాలా అని ఎదురు చూడ్డం, అసూయా ద్వేషాలతో రగిలిపోవటం తప్ప మన ఇండియాలో ఏముంది? నడి రోడ్డుమీద పట్టపగలే హత్యలు, ఆత్మ హత్యలూ, దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు. ఇంతేగా? సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ అలాంటివేవీ ఉండవేమో అనిపిస్తుంది. పైగా ప్రతి ఇంటికీ సెక్యూరిటీ అలారం ఉంటుంది. అలారం మ్రోగితే చాలు, పోలీసులు రెక్కలు గట్టుకుని వాలతారు. నిజానికి అర్థరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరగాలన్నా ఇక్కడ భయం ఉండదు. చేను మేసే కంచెలుండవు. ఇక్కడ స్త్రీ పురష బేధం లేదు. అందర్ని అందరు బాగా చూస్తారు.

ముఖ్యంగా మన భారతీయులంటే మరింత గౌరవంగా ఆడైనా, మగైన చిరునవ్వుల పలకరింపుతో "హాయ్" చెప్పి విష్ చేస్తారు. మాల్ అయినా, బీచైనా, హోటలైన, పార్కైనా, వాకింగ్లో ఐనా ఎక్కడైనా అది వారి ఆచారం కింద చక్కగా పలకరిస్తారు. అదే మన దేశంలో దగ్గర చుట్టమైన ఎంతో పరిచయమున్న మిత్రుడైన ఇష్టం లేకపోతే ముఖం పక్కకి తిప్పుకుని వెళ్ళిపోవడం పరిపాటి. ఇక్కడ ఎవరికెవరు అపరిచితులు కారు. అందరు అందరికి పరిచితుల్లానే విష్ చేసుకుంటూ కదలిపోతారు. నిజం చెప్పాలంటే అమెరికాలో అడుగిడిన ప్రతి క్షణం ఒక వింత అనుభూతి. ఈ అందమైన ప్రకృతి సౌందర్యాలకా? దేశం కాని దేశం వచ్చినందుకా? ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలకా? ప్చ్! ఏమో తెలియదు. ఇక్కడ అందమైన అమ్మాయిల తీరుతెన్నులు, వారి జీవన విధానాలు ఈ దేశపు సంస్కృతీ సాంప్రదాయాలు, కొన్ని ఆశ్చర్యాన్ని మరికొన్ని ఆనందాన్ని కలిగిస్తాయి.

కొందరు పిల్లల్ని పెద్దల్ని చూస్తుంటే షోకేసుల్లో బొమ్మలు వీళ్ళని చూసే చేసారా అన్నంత భ్రాంతి కలుగుతుంది. అంత అందంగా ఉంటారు. ముఖ్యం గా పిల్లల్ని బాగా చూస్తారు. పసితనం నుంచీ హైస్కూలు వరకు చాలవరకు ఉచిత విధ్యా విధానమే. పదహారు సంవత్సరములు రాగానే అమ్మాయిలకు "స్వీట్ సిక్ష్టీన్ " అని గ్రాండుగా ఫంక్షను చేస్తారు (మన చిన్న సైజు పెళ్ళిలాగా ). తర్వాత పద్దెనిమిది వచ్చాక, ముఫై రోజులలోగా ఇంట్లోంచి పంపేస్తారు. (స్వీట్ సిక్ష్టీన్ ఆఫటర్ ధర్టీ డేస్). ఇంకా, వారి వారి ఇష్టాన్ని బట్టి వారి వారి జీవన విధానం ఉంటుంది. ఎక్కడైన రికార్డులో తల్లి పేరు మాత్రమే రాస్తారు. తల్లి దగ్గరకు వెళ్ళాలన్నా ముందుగా ఫోను చేసి వెళ్ళాలి, మన లాగ పుట్టింట్లో వారాలు నెలలు ఉండరు. తల్లిదండ్రులే తామే ఐనా ఎవరి బాయ్ ఫ్రండుతో వాళ్ళు ఎవరి గర్ల్ ఫ్రండుతో వాళ్ళు స్వేచ్చగా తిరుగుతారు. ఎదురెదురు పడినా పలకరించుకుని ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. అందుకే చిన్నప్పట్నుంచీ పార్ట్ టైం జాబులు చేసి సంపాదించుకోవటం నేర్పుతారు. ఎవరి గొడవ వారిదే. స్వేచ్చా జీవులు. అందుకే ఇలాంటి దేశంలో మన ఆచారాలు అలవాట్లు వదులుకుని బ్రతకాలంటే పెద్దలకి ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే కారణం ఏదైనా ఐన వాళ్ళందర్ని వదులుకుని కష్టపడి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి గనుక వృత్తిపరంగానే గాక, మన చుట్టు ప్రక్కల ఉన్న భారతీయులందరితో మన సంప్రదాయాలను పంచు కుంటూ, మనకి మనం స్వదేశీయానందాన్ని పొందవచ్చును.

అందుకే తాము రావడమే కాకుండా, తల్లిదండ్రులనీ దగ్గర ఆత్మీయులనీ, వీసాలు తెప్పించి రప్పించుకుంటున్నారు. పెద్దలకి ఈ వాతావరణం ఇక్కడి అలవాట్లు కొంచం ఇబ్బందికరమైనా, మన పిల్లల దగ్గరే కదా అనో దేశం చూడాలనో ఖచ్చితంగా వచ్చి వెడుతూ ఉంటారు. ఇక ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇంట్లో బాబా భజనలు, లలితా సహస్రాలు, వ్రతాలు, పూజలు, పార్టీలు అందరు కలిసి చేసుకుంటూ ఉంటారు. పెద్ద వాళ్ళు వచ్చారంటే మరింత ఎక్కువగా చేస్తారు. వేసవి కాలంలోనే చాలా మంది వస్తారు. ఎవరింటికి చుట్టాలు వచ్చినా, ఎంతో ఆదరాభిమానాలతో లంచులు డిన్నర్లు ఏదో వంకన పార్టీలు జరిపి కానుకలిచ్చి పంపుతూ ఉంటారు.

ఇక్కడ వెంకటేశ్వరస్వామి గుడి, దుర్గామాత గుడి, బాబా గుడి... ఇలా దేవాలయాలు ఉన్నాయి. పర్వ దినాలలో కలిసికట్టు గా వెడుతుంటారు. అక్కడ మనం మర్చిపోతున్నా మనుకుంటున్న సంస్కృతికి ఇక్కడ హారతి పడుతున్నారు. ఎటొచ్చీ అటు భారతీయతకి ఇటు అమెరికాకి మధ్య త్రిశంకు స్వర్గంలో ఉన్నవాళ్ళు అక్కడా ఇక్కడా కూడా లేకపోలేదు. నిజానికి తల్లిదండ్రుల్ని పట్టించుకోని కొడుకులూ, అత్తమామల్ని లెక్కచేయని కోడళ్ళు ఉన్న ఈ రోజుల్లో అందునా మన దేశంలో లక్షలు ఖర్చు బెట్టి ఇక్కడికి తీసుకొచ్చి దేశదేశాల సౌందర్యాలనీ, వింతలు విడ్డూరాలనీ చూపిస్తున్న కొడుకులూ, వారికి అనుగుణంగా నిండు మనసుతో ఆహ్వనించి ఆదరించే కోడళ్ళు, గ్రాండ్ మా గ్రాండ్ పా అంటూ పెద్దల ప్రేమ కోసం మురిపెంగా హత్తుకుపోయే మనవలు తిరుగు ప్రయాణం రోజున బట్టలు సర్దుతుంటే గుండెలు బరువెక్కి కళ్ళల్లో నీళ్ళు తెరిగాయి.
వెడుతున్నామని తెలిసి అందరు బయటికి వచ్చి చేయి ఊపుతూ "బై ఆంటీ! మళ్ళీ తొందరగా రావాలి" అంటూ బాధగా హావభావాలు ప్రదర్శిస్తుంటే, ఎన్ని సార్లు వచ్చి వెళ్ళినా మార్పులేని ఈ మమత, రాగాను రాగాలు, ఈ మంచు పూల మధ్య ఇంతటి ఆహ్లాదాన్ని ఒదులుకుని, ఈ బంధాలకి దూరంగా ఇవన్నీ అందర్నీ దాటుకుంటూ కారు విమానాశ్రయం వైపు కదిలే సరికి గుండెల నిండా బరువు ఈ మంచు (పూలు) నింపిన బరువు ... మోయ లేనంత... బరువు... అది... మెల్ల...గా... కరగాలే... తప్ప....? ?...?

" మరుత్తులు "

మరుత్తులు
తన పుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల మరణానంతరం దుఃఖితురాలైన దితి కశ్యపుని చెంత జేరి భర్తకు శ్రద్ధగా సపర్యలు చేయడం వలన కశ్యపుడు ఆమెనుద్దేశించి "ప్రేయసీ! నీ శుశ్రూషలకు మిక్కిలి సంతసించితిని. ఏమి వరము కావలయునో కోరుకొనుము, అవశ్యము నెరవేర్చెదను" అని వాగ్దాన మొసంగెను.

అందులకు సంతసించిన దితి "ఇంద్రుని జయించగల పుత్రుని ప్రసాదించమని" కోరినది. అందుకు కశ్యపుడు చింతించి "ఇచ్చిన మాట దాట రాదు కావున, శుభాంగీ ! నీవు ఒక సంవత్సరము నియమ నిష్టలతో వ్రతమాచరించిన యెడల నీ కోరిక తీరగలదు" అని భార్యకు వ్రతమునుపదేశించెను. అందులకు సమ్మతించిన దితి గర్భవతియైనది. ఇంద్రునికీ విషయము తెలిసి భయపడి, మారువేషమున ఆమె చెంత జేరి,శుశ్రూషలొనరించు సమయము కొరకు పొంచి ఉండగా

ఒక దినము సాయం సమయమున ఎంగిలి తాకి కాళ్ళు చేతులు శుభ్రము చేసుకొనకుండా దితి మైమరచి నిద్రించినది. అప్పుడు సమయమునకయి పొంచి ఉన్న ఇంద్రుడు, ఆమెకు నియమ భంగమైనందుకు మిక్కిలి సంతోషముతో తన యోగ మాయవలన ఆమె గర్భమునందు ప్రవేశించి గర్భ కోశమునందుగల పిండమును ఏడు ముక్కలుగా చేసి మరల ఆ ఏడుముక్కలను ఒక్కొక్క దానిని ఏడు చుప్పున మొత్తము 49 ముక్కలుగావించెను. అప్పుడు ఆ శిశువులు "అన్నా మేము నీకు తమ్ములము మమ్ము కాపాడుము" అని మొఱపెట్టుకొనగా ఇంద్రుడు ఆ 49 మందికి దైవత్వము నొసగి సోమపానము జేయు అధికారము ఇచ్చెనట. వారే "మరుత్తులు" అనగా ఇంద్రుని అనుచరులు (సోదరులు)

9, జనవరి 2011, ఆదివారం

సమస్య " కాంత జూచి మౌని కన్ను గొట్టె "

ఎంత వారలైన కాంత దాసులనుట
వింత కాదు మనకు పంత మేల ?
తనదు పాదమంటి తబిసియౌ మ్రొక్కంగ
కాంత జూచి మౌని కన్ను గొట్టె !

8, జనవరి 2011, శనివారం

సమస్య " కలహంసల తప్పుగాక కాకుల తప్పా ? "

కిల కిల పక్షుల రవములు
తెలవారగ మేలు గొలుప తరువుల పైనన్ !
కలకంఠి కలలు కరిగెను
కలహంసల తప్పు గాక కాకుల తప్పా ?
-------------------------------
కల భామినులంత కలసి
వల విసురుతు మురిపింపగ వలపులు కురియన్ !
మలహరుని మతి చలించగ
కలహంసల తప్పు గాక కాకుల తప్పా ?
మలహరుడు = శివుడు
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase